అద్దంకి ప్రమాద ఘటనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్సైలు వెంటనే 108కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

ప్రకాశం జిల్లా: అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని శంఖవరప్పాడు గ్రామంలో ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు లేవని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు స్పందించి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారని తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5.15 గంటల సమయంలో బల్లికురవ నుంచి అద్దంకి వైపు వస్తున్న AP 27 CB 4789 కారు, ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయే క్రమంలో అదే దిశలో వెనుక వస్తున్న AP 27 TB 1656 ఆటోను ఢీకొట్టిందని ఎస్పీ వివరించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న ఎస్పీ అద్దంకి పోలీస్ స్టేషన్ను సందర్శించి ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ప్రమాద సమయంలో కారులో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ఉన్నారని ఎస్పీ తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే వారు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారని, అంబులెన్స్ వచ్చే వరకు ఘటనాస్థలంలోనే ఉండి గాయపడిన వారిని అంబులెన్స్లో ఎక్కించి ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారని చెప్పారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని కూడా పరిశీలించారని తెలిపారు.
ఈ విషయానికి సంబంధించి పోలీసుల వద్ద వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు.
ఎస్సైలు మద్యం మత్తులో ఉన్నారని, ప్రమాదం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని, సిగరెట్లు తాగుతూ ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రమాద సమయంలో పోలీసు సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని, ఎస్సైలు కొంతసేపు ఘటనాస్థలంలో ఉండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారని తెలిపారు. ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించడం, గొడవకు దిగడం వంటి ఘటనలు జరగలేదని చెప్పారు.
ప్రైవేట్ వాహనంలో గంజాయి, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన సమాచారంపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించే సమయంలో కొన్ని సందర్భాల్లో పోలీసులు ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించాల్సి వస్తుందని వివరించారు.
అయితే డ్యూటీలో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందని అన్నారు. బైక్ను తప్పించబోయే క్రమంలో అనుకోకుండా ఆటోను ఢీకొట్టిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అద్దంకి ప్రమాద ఘటనపై సమర్థవంతంగా దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు అద్దంకితో పాటు జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
వాస్తవాలను తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల పోలీసు శాఖ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.
ఏదైనా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకుని బాధ్యతగా ప్రచురించాలని మీడియాను కోరారు.