ధరల పెరుగుదలపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయడం లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సంజీవని పేరుతో జగన్ పథకాలకు స్టిక్కర్లు వేస్తున్నారని ఆరోపించారు.

విశాఖపట్నం: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, చంద్రబాబుది ‘విజనరీ పాలన’ కాదని, ప్రజలపై భారాలు మోపే ‘బాదుడే బాదుడు పాలన’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని జీడీపీలో నంబర్ వన్ చేస్తామని చెబుతోందని, అయితే ప్రజల దృష్టిలో G అంటే గ్యాస్, D అంటే డీజిల్, P అంటే పెట్రోల్ ధరలు పెంచడంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు. మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కాక ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి అన్నారు. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై స్టేట్ వ్యాట్తో పాటు అదనపు వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తోందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదా రాష్ట్ర పన్నులను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించలేకపోతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వరుదు కళ్యాణి తెలిపారు. టమాటా ధరలు పెరిగిన సమయంలో రైతుల నుంచి అధిక ధరకు టమాటాలను కొనుగోలు చేసి వినియోగదారులకు సబ్సిడీపై తక్కువ ధరకు అందించామని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో పెద్ద మొత్తంలో టమాటాలు, ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరలకు అందించామని ఆమె పేర్కొన్నారు. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని కూడా సబ్సిడీ ధరకు అందించామని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా నిధులు వెచ్చించి ప్రజలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ధరల నియంత్రణపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
అరకు పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంజీవని ఆరోగ్య కార్యక్రమంపై కూడా వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని, వాటికే కొత్త పేర్లు పెట్టి ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని ఆరోపించారు.
“సంజీవని గేమ్ ఛేంజర్ కాదు.. జగన్ పథకాలకు నేమ్ ఛేంజర్” అని ఆమె వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, టెలీమెడిసిన్, డిజిటల్ హెల్త్ కార్డులు గత ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చామని ఆమె తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అరకు కాఫీ అభివృద్ధిపై కూడా ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. అరకు కాఫీకి దశాబ్దాల చరిత్ర ఉందని, బ్రిటిష్ కాలం నుంచే ఈ ప్రాంత కాఫీకి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతో పాటు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని వరుదు కళ్యాణి ఆరోపించారు. పాడేరు మెడికల్ కాలేజీలో గతంలో ప్రతిపాదించిన వైద్య విద్య సీట్ల విషయంలో ప్రభుత్వం కోత విధించిందని, పార్వతీపురం మెడికల్ కాలేజీ భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొందని ఆమె ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రహదారులు, కనెక్టివిటీ వంటి మౌలిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ధరల పెరుగుదల, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు మత రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని వరుదు కళ్యాణి ఆరోపించారు. వైఎస్సార్సీపీకి మానవత్వమే మతమని ఆమె అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలను ఉపయోగించుకోవడం తగదని విమర్శించారు. విజయవాడలో దేవాలయాల కూల్చివేతలు, సింహాచలంలో గోడ కూలిన ఘటన, కాశీబుగ్గ తొక్కిసలాట, పెదకాకాని ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్వహణ తీరుపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.
నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే నియంత్రించాలని వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని కోరారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు.